పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారుల వేగం మరింత పెరగాలని కలెక్టర్ అరుణ్కుమార్ జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ జిల్లా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ప్రారంభించనున్న ''జగనన్నకు చెబుదాం..'' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా.. ఏకకాల సమయంలోనే... ప్రజల నుంచి వినతిని స్వీకరించడం, అందుకు సంబంధించిన ఆమోదయోగ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో, సీఎంవో స్థాయి నుంచి నేరుగా సచివాలయాల పరిధిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. కావున అధికారులు అందరూ బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, అడిషనల్ ఎస్పీ రామకష్ణ ప్రసాద్, డీఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.










