ధర్మవరం టౌన్ : ప్రజల సమస్యలను తీర్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రేగాటి పల్లిలో సురేష్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేక అధికారి చాంద్ బాషా, జిల్లా పంచాయతీ అధికారి విజయకుమార్, విస్తరణ అధికారి మమతా దేవి, సర్పంచి సురేష్ రెడ్డిల ద్వారా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సువర్ణ, మురళి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కదిరి టౌన్ : సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశమని ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కదిరి రూరల్ మండలం ఏర్రదొడ్డిలో బుధవారం నిర్వహించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి గుర్తించిన 372 సేవలను లబ్దిదారులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అంజినప్ప, డివిజనల్ అభివృద్ధి అధికారి సూర్య నారాయణ, తహశీల్దార్ నటరాజ్, సర్పంచి తోటలక్ష్మి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : మండల కేంద్రంలోని బత్తలపల్లి-2 సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్ఒ వంశీకృష్ణారెడ్డి, డిపిఒ విజయకుమార్రెడ్డి, ఎంపీపీ బగ్గిరి త్రివేణి, జెడ్పీటీసీ కోటి సుధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువపత్రాలను ఈసందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యుగేశ్వరిదేవి, ఎంపీడీవో సౌజన్యకుమారి, ఇఒఆర్డి దివాకర్, సచివాలయ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, ఉప సర్పంచు కోటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని చేపట్టారని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 'జగనన్న సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత వైసిపికి దక్కుతుందన్నారు. 11 రకాల సేవలను 'జగనన్న సురక్ష' ద్వారా ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ధవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివశంకరప్ప, నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, చైర్మన్ ఫరూక్, వైస్ చైర్మన్లు సునీల్, జయరెడ్డి, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : కోడూరు పంచాయతీ కేంద్రంలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచి మురళీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 817 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఒ రామ్ కుమార్, వైస్ ఎంపిపి అంజలీదేవి, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి: తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామపంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచి సదానంద, ఎంపిటిసి చంద్రబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేక అధికారి డ్వామా పీడీ రామాంజనేయులు, తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టిందని గ్రామ సచివాలయ జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గూని పల్లి గ్రామంలో సర్పంచి విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వైసిపి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా1087 సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ సనావుల్లా, అగ్రి అడ్వైజరీ చైర్మన్ రమణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి సతీష్ బాబు, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










