
సిపిఎం ప్రజారక్షణ భేరిని జయప్రదం చేయండి
వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
ప్రజాశక్తి- పలమనేరు
అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడ జరిగే ప్రజారక్షణ భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను సిపిఎం నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఓబులరాజు, గిరిధర్ గుప్తా మాట్లాడుతూ... దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరినీ కలవరపరుస్తున్నాయని అన్నారు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా మన బతుకులను రాష్ట్ర భవిష్యత్తును సక్రమంగా నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి నాయకులు మనకు అర చేతిలో స్వర్గం చూపించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్ వంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరి కార్యక్రమం ఈనెల 15న విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నదని, ప్రజాసంక్షేమం కోసం ప్రజాప్రణాళికను ప్రజలు ముందు ఉంచిందని తెలిపారు. జిల్లాలో కూడా పలమనేరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, పండ్ల రైతులు ఆదుకోవడానికి ఫల్ప్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, నగరిలో పవర్ లూం కార్మికులకు కూలిరేట్లు పెంచి, 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. నాయకులు భువనేశ్వరి, ఈశ్వర్, సుబ్రహ్మణ్యం, ఆంజి, పాకాల సుబ్రహ్మణ్యం, లక్ష్మయ్య పాల్గొన్నారు.