ప్రజాశక్తి- చిలమత్తూరు : సిపిఐ(ఎం) అభ్యర్థి గా పోటీ చేస్తున్న డాక్టర్ అనీల్ కుమార్కి ఆ ప్రాంతంలో అత్యధిక సభ్యత్వం ఉన్న హసిరు రైతు సంఘం తన మద్దతు తెలిపింది. ఈ మేరకు గుడిబండ తాలుకా కేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఎం అభ్యర్థి డాక్టర్ అనీల్ కుమార్ హాజరు కాగా అభ్యర్థి నామినేషన్ కోసం రైతు సంఘం సభ్యులు చందాలు వేసి 6,770 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్బంగా హసిరు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హెచ్పి రామనాథ్ రెడ్డి మాట్లాడుతూ డిల్లీ కేంద్రంగా రైతు సమస్యలపై జరిగిన మహాఉద్యమంలో కమ్యునిస్టు పార్టీల నాయకత్వం చారిత్రక ఘట్టమని అన్నారు. రైతులకు అండగా ఉండే కమ్యునిస్టు పార్టీ అభ్యర్థిని హసిరు రైతు సంఘంగా బలపరుస్తున్నామని అన్నారు. అధికారంలో ఉన్నపుడు అనేక మంది రైతులకు భూములు పంచిన సిపిఐ(ఎం)కి, భూములను కబ్జాచేసి వందల కోట్ల రూపాయలకు అధిపతులు అయిన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. అనేక మంది రైతు కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత బాగేపల్లి క్షేత్రంలో సిపిఐ(ఎం)కు ఉందని రైతుల పక్షానే నిలబడి పోరాడే కమ్యునిస్టు పార్టీ అభ్యర్థికి రైతు సంఘాలన్నీ ఐక్యంగా మద్దతు ప్రకటిస్తున్నామనివెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) చిక్ బలాపుర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప, హసీరు రైతు సంఘం నాయకులు హెచ్ రామ్నాథ రెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, రవీంద్రరెడ్డి, బలరాములు, మహిళ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










