
ప్రజాశక్తి - భీమడోలు
మండల పరిషత్ కార్యాలయం ద్వారా చేపట్టిన, అమలు చేసిన సంక్షేమ, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా కొనసాగటానికి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్.సింహాద్రి(శంకర్) అందించిన సేవలు అభినందనీయమని భీమడోలు మండల పరిషత్ అధ్యక్షులు కనమాల రామయ్య తెలిపారు. భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా పనిచేసిన సింహాద్రి ఉద్యోగోన్నతిపై నల్లజర్ల మండలం పంచాయతీ విస్తరణాధికారిగా ఇటీవల కాలంలో బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో భీమడోలు మండల పరిషత్ అధ్యక్షులు, కార్యాలయ అభివృద్ధి అధికారి పద్మావతి దేవిల ఆధ్వర్యంలో శుక్రవారం భీమడోలు కార్యాలయంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో జూనియర్ సహాయకులుగా భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించానన్నారు. ఆ తర్వాత ఉద్యోగోన్నతిపై సీనియర్ సహాయకులుగా భీమడోలు ఇంజనీరింగ్ కార్యాలయ విభాగం, ఆ తర్వాత సుదీర్ఘకాలం జెడ్పి కార్యాలయంలో పనిచేసిన తర్వాత తిరిగి బదిలీపై భీమడోలు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చానన్నారు. ఆ తరువాత కాలంలో ఉద్యోగోన్నతిపై నల్లజర్ల పంచాయతీ విస్తరణాధికారిగా బదిలీ అయ్యానన్నారు. తన ఉద్యోగ కాలంలో తనకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు, ఇతర సిబ్బంది అందజేసిన సహాయ సహకారాలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావు, కె.రాజుతో పాటు భీమడోలు పంచాయతీ కార్యదర్శి ఎం.ఠాగూర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది, సర్పంచులు, ఎంపిటిసిలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.