
- స్లో యాక్షన్ డ్రామా 'సామాన్యుడు'
ఈ వారం విడుదలైన తాజా చిత్రం 'సామాన్యుడు'. యాక్షన్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో విశాల్, డింపుల్ హయాతి హీరోయిన్గా, తమిళ దర్శకుడు శరవణన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ బాగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులని థ్రిల్కి గురి చేసిందా, లేదా తెలుసుకోవాలంటే ముందు కథేంటో తెలుసుకుందాం..

చిత్రం : సామాన్యుడు
నటీనటులు : విశాల్, డింపుల్ హయతి,
యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రావి, మారిముత్తు, రాజా, ఇలంగో కుమారవేల్, మనోహర్ తదితరులు
దర్శకత్వం : శరవణన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజా
ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్
కళ : ఎస్ఎస్ మూర్తి
విడుదల తేది : ఫిబ్రవరి 4, 2022
కథలోకి వెళ్తే.. పోరస్ (విశాల్) సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి (మారిముత్తు) పోలీస్ ఆఫీసర్, తల్లి (తులసి), చెల్లి (రవీనా రావి). అయితే తన తండ్రిలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని చిన్నప్పటి నుండీ కలలు కనే ఓ సామాన్య యువకుడు పోరస్. బాగా డబ్బు, పలుకుబడి ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా తన తండ్రి వారి చేతిలో చేతగానివాడిగా మారడాన్ని పోరస్ గమనిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. కుటుంబం, కలలే ప్రపంచంగా బతుకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక ఓ పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. పోకిరి నుంచి ద్వారకను కాపాడుకునే క్రమంలోనే ఆమె హత్యకు గురవుతుంది. ద్వారకతో పాటు మరికొన్ని హత్యలు కూడా జరుగుతాయి. ఈ హత్యల వెనక రాజకీయం ఉంటుంది. ఈ పోరస్ కుటుంబానికి, ఆ పొలిటికల్ వ్యక్తులకి సంబంధం ఏమిటి? ఆ వలయాన్ని ఛేదించి హత్యల వెనకున్న హంతకులను పోరస్ ఎలా బయటకు తీశాడన్నదే మిగతా కథ..
క్రైమ్ డ్రామాతో కూడిన ఓ యాక్షన్ థ్రిల్లర్ ఇది. చాలా సినిమాల్లో చూసిన సాధారణ కథే. కానీ, దర్శకుడు ప్రత్యేకమైన కథనంతో సినిమాని అసక్తికరంగా మార్చాడు. ఆరంభ సన్నివేశాలు సాదా సీదాగానే అనిపించినా, కథలోకి రాజకీయం ప్రవేశించాక ఆసక్తికరంగా మారుతుంది. కథానాయకుడి చెల్లెలు, దివ్య అనే యువతి, సామాజిక కార్యకర్త కథలను ముడిపెట్టిన విధానం మెప్పిస్తుంది. ప్రథమార్థం హత్యోదంతాలు, బాధితుల నేపథ్యాల పరిచయంతో సాగుతుంది. ఆ హత్యల వెనకున్న హంతకులను కథానాయకుడు వేటాడే క్రమమే ద్వితీయార్థం. విరామానికి ముందున్న, పతాక సన్నివేశాలు మరింత ఆసక్తిగా సాగుతాయి. గౌరవం, పలుకుబడి కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఆకృత్యాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. విశాల్ మార్క్ యాక్షన్ కథ ఇది.

విశాల్కి అలవాటైన పాత్రే ఇది. పోరస్గా మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సామాన్య యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. డింపుల్ హయాతి కథానాయకిగా, ప్రియురాలిగా కనిపించారు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, ఉన్నంతలో అందంగా కనిపించింది. కథానాయకుడి స్నేహితుడిగా కమెడియన్ యోగిబాబు రోల్ సినిమాలో కాసిన్ని నవ్వులు పూయిస్తుంది. అలాగే విశాల్కి సోదరి పాత్రలో నటించిన రవీనా మంచి నటనను కనబరిచారు. తల్లిగా తులసి ఆయా పాత్రలపై ప్రభావం చూపించారు.
అయితే ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి అని చెప్పాలి. చాలా స్లోగా అక్కడక్కడా సాగదీతగా అనిపించడం సినిమా చూసే ఆడియెన్స్కి కాస్త చికాకు తెప్పిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసర సన్నివేశాలు ఎక్కువే కనిపిస్తాయి. సాంకేతిక విభాగంలో యువన్ సంగీతం హైలెట్గా నిలిచింది. బిజిఎం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. కెవిన్ కెమెరా పనితనం ఫర్వాలేదు. ఇక దర్శకుడు శరవణన్ విషయానికి వస్తే తనకిది మొదటి సినిమానే అయినా తన వల్ల అయ్యినంత మేర ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పాలి. అందరికీ కనెక్ట్ అయ్యే మంచి నేపథ్యంలో అందులో డ్రామా యాడ్ చేసి, తన సినిమాని బాగానే ప్లాన్ చేశాడు. కానీ సినిమాని సీన్ టు సీన్ తీసుకెళ్లే క్రమంలో స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాల్సింది. ఇది తప్పితే దర్శకత్వంలో వంక పెట్టడానికి ఏమీ లేదని చెప్పొచ్చు. తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.