Nov 10,2023 17:10

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
   సామాజిక బాధ్యతతో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించాలని నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ కె.ప్రియాంక తెలిపారు. నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో ఏలూరు ఆదివారపు పేటలోని ది సాల్వేషన్‌ ఆర్మీ మిలీనియం చర్చి ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు, సోషల్‌ మీడియా దుర్వినియోగంపై వర్క్‌షాప్‌ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, అంతేకాక మన నిత్యజీవితంలో చాలా మంది విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారని తెలిపారు. సరైన అవగాహనతో మాదక ద్రవ్యాలను కట్టడి చేయవచ్చునన్నారు. విద్యార్థులు మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ముందుగా గుర్తించి, సరైన అవగాహన, కౌన్సెలింగ్‌, డి అడిక్షన్‌ సెంటర్లకు పంపించాలని తెలిపారు. ప్రతిఒక్కరూ తమవంతు సామాజిక బాధ్యతగా తీసుకుని, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు. అనంతరం నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌.జాకబ్‌ రాజు మాట్లాడుతూ మత్తు పదార్థాలు మనకి ప్రస్తుత కాలంలో అన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉండటం బాధాకరమన్నారు. ఇది వ్యక్తులలో ఒంటరితనం, డిప్రెషన్‌కు సోషల్‌ మీడియా కారణమవుతుందన్నారు. తద్వారా అనేక మందిలో నిద్రలేమికి కూడా కారణమవుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయని తెలిపారు. సోషల్‌ మీడియాతో వచ్చే దుష్ఫ్రభావాలు, వెనకబడిపోతున్నామనే భయం, ఒంటరితనం, నిరాశ, ఆందోళన, సైబర్‌ బెదిరింపులు ఉంటాయని, సోషల్‌మీడియా ప్రతికూల ప్రభావాలను, అలవాటును నివారించవచ్చని వివరించారు. మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటకు తీసుకురావడానికి డీ-ఎడిక్షన్‌ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. జిల్లాలోని నూజివీడు మండలం పొనసానిపల్లిలో ఈచికిత్స అందించేందుకు 'నవజీవన్‌ బాల భవన్‌ ఏర్పాటు చేసిన బోస్కో డీ-ఎడిక్షన్‌ సెంటర్‌ని సంప్రదించాలన్నారు. ఇలాంటి సమస్యలతో ఉన్న విద్యార్థులు, యువత 9490492020 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. అనంతరం ది సాల్వేషన్‌ ఆర్మీ మిలీనియం చర్చి మేజర్‌ జల్లి మోషే మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఈ అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రస్తుత రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురై డ్రగ్స్‌కు బానిసలై జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని, ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి సామాజిక బాధ్యతతో విద్యార్థులు, యువతను రక్షించాలని హితవు పలికారు. ఈ వర్కుషాప్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నవజీవన్‌ బాల భవన్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్స్‌ బి.నెహేమియా, డి.రజిత, ది సాల్వేషన్‌ ఆర్మీ మిలీనియం చర్చి మేనేజర్‌ జి.జాకబ్‌, యం.ఫ్రాన్సిస్‌, కెప్టెన్‌ టి.శ్యాంబాబు, చర్చి పాస్టర్‌, సభ్యులు పాల్గొన్నారు.