పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసు బదిలీల ప్రక్రియ రెండవ రోజు కొనసాగింది. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన బదిలీల్లో ఏడుగురు ఎఎస్ఐలు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో గత ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారికి ఎస్పీ ఎస్వి.మాధవ్రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి పాదర్శకంగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగుల జీవితంలో బదిలీలు సాధారణమని, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బదిలీల కోసం వచ్చిన సిబ్బందితో ఎస్పీ వ్యక్తిగతంగా మాట్లాడారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఎస్పీతో పాటు ఆదనపు ఎస్పీ కెవి.రామకృష్ణప్రసాద్, ఎస్పిఐ రవీందర్ రెడ్డి, సిసి రాఘవేంద్ర, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.










