
ప్రజాశక్తి - చాట్రాయి
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులన్నీ పంపిణీ చేయాలని బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చిన్నంపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వి.రమేష్కు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ చిన్నంపేట గ్రామంలో ప్రజా పంపిణీ వాహనం ద్వారా పంపిణీ చేసే నిత్యవసర సరుకులు కందిపప్పు గత సంవత్సరం నుంచి ఇవ్వటం లేదని, ఈనెలలో పంచదార కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పేద ప్రజలకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా చేయాలని కోరారు. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్ పర్యవేక్షణ ఉండేదని, ఏ నెల సరుకులు ఆనెల క్రమం తప్పకుండా వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావటం లేదో అర్థం కావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేలూరు ప్రసాద్, డి.ఏసుబాబు, కొమ్ము పున్నమయ్య, పేదలు పాల్గొన్నారు.