
ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : వర్షాలు మొదలు కావడంతో జిల్లాలో రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారని తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ వనరుల కేంద్రం మెరుగు భాస్కరయ్య ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సాగులో రైతులు తీసుకోవల్సిన సూచనలు తెలియజేశారు. రబీ కాలంలో నెల్లూరు మషురి (ఎన్ఎల్ఆర్ - 34449), నెల్లూరు దాన్యా రాసి (ఎన్ఎల్ఆర్ 3354), సుగంధి (ఎన్ఎన్ఆర్ 30491), ఎంటియు 1010, 1001,1224, బిపిటి 2846 వంటి రకాలను రైతులు సాగుకు ఎంచుకోవచ్చును. నవంబర్ రెండో పక్షంలో నార్లు పోసుకొని డిసెంబర్ 15లోపు నాట్లు వేసుకోవాలి. ఎకరానికి 25-30 కిలోల విత్తనాన్ని, 4-5 సెంట్లు నారు పెంచితే, నారు ఆరోగ్యంగా ఉంటుంది. వరి విత్తనాలను భావిస్టిన్ మందు ద్రావణంలో (లీటర్ నీటికి 2 గ్రాములు) నానబెట్టి నారు పోస్తే, పైరుకు రోగాల బెడద ఉండదు. నారుమడి నుండి నారు తీసే వారం రోజులు ముందు ఎకరానికి సరిపడా నారుమడికి కిలో కార్బోఫ్యరాన్ 3జి గుళికలు వేసి నీరుపెట్టి ఇంకించాలి. దీనివలన పొలంలో నెల వరకు పైరుకు పురుగులు ఆశించవు. 25 రోజుల వయసుగల నారును ప్రధాన పొలంలో నాట్లు వేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి.