
ప్రజాశక్తి - చింతలపూడి
పంటల బీమా పథకం నిబంధనల ప్రకారం పంట నష్టపరిహారం లభించని పరిస్థితుల్లో ప్రభుత్వమే బాధ్యత వహించి, పంట నష్టపోయిన రైతుకు సర్వే నెంబర్ విస్తీర్ణం మేరకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ, ఎపి రైతు సంఘం మండల కమిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. మంగళవారం చింతలపూడి తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, డిప్యూటి తహశీల్దార్ షకీలాకి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఎపి రైతు సంఘం కార్యదర్శి దంతా కృష్ణ మాట్లాడుతూ పంటల బీమా పథకంతో సంబంధం లేకుండా, సర్వే నంబర్ ఆధారంగా పంట నష్టపరిహారం ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి సర్వేనెంబర్ ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని, పండిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా ఆర్బికేల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. మండలానికి సాగునీరు అందాలంటే తక్షణమే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి, మండలంలో ఉన్న అన్ని చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు, తాగునీరు సరఫరా చేయాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తోర్లపాటి బాబు, పట్టణ కార్యదర్శి ఎస్కె.జానీ, ఎపి రైతు సంఘం నాయకులు తక్కెళ్లపాటి ప్రసాద్, రావెళ్ల హనుమంతరావు, రైతులు గట్టు వెంకటేశ్వరరావు, గట్టు వెంకన్న, బోడా నాగరాజు, సంకు శ్రీనివాసరావు, వినుకొండ సీతారామయ్య పాల్గొన్నారు.