Nov 01,2023 00:06

ప్రజాశక్తి-ముమ్మిడివరం
దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపరుస్తున్నాయని, రాష్ట్ర భవిష్యత్తును సక్రమార్గాన నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించవలసిన కాలం వచ్చింది అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి అన్నారు. ప్రజా రక్షణ భేరి ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముమ్మిడివరం పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక ,కర్షక, ప్రజా, వ్యతిరేక విధానాలు చాలా వేగంగా అమలు చేస్తుందన్నారు దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు ప్రారంభం అయ్యాయని అన్నారు. అందులో భాగంగా నవంబర్‌ 7న డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా చేరుకుంటుందన్నారు. మండపేటలో ప్రారంభమై రావులపాలెం, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో బహిరంగ సభలో జరుగుతాయని ఈ బహిరంగ సభలకు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి, జనసేన పార్టీలు మాట్లాడడం లేదన్నారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. డాక్టర్‌ బిఅర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ లేకపోవడం, మహిళా డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. స్లూయీజ్‌ లు సరిగ్గా లేక పంటలు క్రాప్‌ హాలిడే చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కార్మికుల ఉపాధి లేక ప్రజల దగ్గర డబ్బులు ఉండడం లేదని కొనుగోలు శక్తి పడిపోయి రాష్ట్రం, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే బిజెపి ప్రభుత్వం మాత్రం మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలందరినీ పోరాటాల వైపుకు మళ్ళించే విధంగా ఈ యాత్ర ఉంటుందని అన్నారు. అనంతరం పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సిపిఎం కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుదే దుర్గాప్రసాద్‌, మండల నాయకులు విప్పర్తి మోహన్‌ రావు, తాడి శ్రీరామ్‌ మూర్తి ,దొమ్మేటి రాఘవులు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.