
ప్రజాశక్తి-కొండపి: రాష్ట్రంలో జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కొండపి శాసన సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శనివారం కొండపి మండలంలోని ముక్కోడిపాలెం గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, ప్రజలపై జరిగే అన్యాయాలను, టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిస్తున్న జగన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైసిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని మరచి సమాజ సంపదను దోచుకుంటోందన్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ప్రజలు తరిమిగొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు బి యలమందనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే స్వామి వెంట రాష్ట్ర నాయకులు రావిపాటి సీతమ్మ, నియోజకవర్గ పరిశీలకులు ఏ స్వాములు, గ్రామ నాయకులు ఎన్ సుబ్బరామయ్య, బి సోమయ్య, ముక్కు ప్రసాదు, మండల మహిళ నాయకులు బి ప్రసన్నలక్ష్మి, యూత్ అధ్యక్షులు కాలేషా, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, దేపూరి సుబ్బారావు, వై పెద్దోడు, నేతి రవికుమార్, బి అనిల్కుమార్, దేపూరి మస్తాన్ మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.