అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై పరిశీలన పూర్తి చేశామని కలెక్టర్ ఎం.గౌతమి తెలియజేశారు. ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మంగళవారం ఎలక్టోరల్ రోల్స్ - స్పెషల్ సమ్మర్ రివిజన్, 2024 ఓటర్ల జాబితా తయారీపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షను మంగళవారం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఒ గాయత్రీ దేవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అనర్హుల ఓటర్లకు సంబంధించి 56,874 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటి పరిశీలన పూర్తి చేశామన్నారు. రాజకీయ పార్టీలు అందించిన ఫిర్యాదుల్లో డెత్ కేసులకు సంబంధించి 20,993 కేసులకు సంబంధించి పరిశీలన పూర్తి చేశామన్నారు. ఆయా క్లెయిమ్స్కు సంబంధించి ఫామ్లను సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేశామన్నారు. పెండింగ్ ఉన్న అప్డేటెడ్ ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరులోగా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఫారం-6, 7, 8 లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా పరిశీలనను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఈఆర్ఒ స్థాయిలో ఈనెల 19వ తేదీన సమావేశాలు ఏర్పాటు చేశామని, 20న జిల్లా ఎన్నికల అధికారితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఒలు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, రవీంద్ర, హెచ్ఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఈఆర్ఒలు వెంకటేశ్వర్లు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.










