పట్టాలిచ్చారు సరే..భూములెక్కడ..? : సిపిఎం
ప్రజాశక్తి - బాలాయపల్లి
రెవెన్యూ అధికారులు పదేళ్ల క్రితం మండలంలోని కోటంబేడు గ్రామానికి చెందిన ఎస్సీలకు డీకేటీ పట్టాలతోపాటు పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్లలో పొందుపరిచారు. అయితే ఆ భూములు ఎక్కడ ఉన్నాయని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఆ భూములను పెత్తందారులు ఆక్రమించి ఆన్లైన్ లలో నమోదు చేసుకోవడం దారుణమన్నారు. 10 ఏళ్ళు నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కాలయపన చేయడం దారుణమన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను గ్రామంలోని రైతులు ఆక్రమిస్తే ఆ భూములను రెవెన్యూ శాఖ అధికా రులు ఆన్లైన్లలో నమోదు చేసి పేదల నోరు కొట్టడం దారుణమని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్సీలకు ఇచ్చిన భూములు వారికి ఇచ్చేలా ప్రత్యేకమైన చర్యలు చేపట్టకపోతే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మండల సిపిఎం సీనియర్ నాయకుడు గజ్జల రాజగోపాల్ పాల్గొన్నారు.










