ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని విరివిగా మొక్కలు నాటడం ద్వారానే రేపటి తరాలకు ఆరోగ్యకరమైన పకృతిని అందించగలమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య శాఖతో పాటు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు - పరిష్కారాలు అనే అంశానికి సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ కొండయ్య, డిఎంహెచ్ఒ ఎస్వి. కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై విస్తతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నేడు వాహనాల వేగం పెంచుతూ ఇంధన కొరతతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయన్నారు. కార్బన్ డయాక్సైడ్ తదితర విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడంతో భూమండలం వేడెక్కుతోందన్నారు. తద్వారా అడవులు జల వనరులు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా పకృతి కాలుష్యానికి కారణం అవుతున్నాయన్నారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం, ప్లాస్టిక్కి దూరంగా ఉండటం, ఇంధన వాడకం తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకొందామని పిలుపునిచ్చారు. వాతావరణం కాలుష్యం కాకుండా ఉండటానికి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి వారిని భాగస్వాములు చేయాలని అప్పుడే కొంతవరకైనా పకతిని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుబ్బారావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ రషీద్, డిపిఒ విజరు కుమార్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి, భూగర్భ జలాల శాఖ అధికారి రాజశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










