ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి ప్రముఖ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, ఆయన సతీమణి హరిత జన్మదిన సందర్భంగా స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కనిగిరి మండలం లింగారెడ్డిపల్లిలో 11 సంవత్సరాలుగా మంచంపై ఉంటున్న వ్యక్తికి డాక్టర్ పెరుగు మురళీకృష్ణ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కనిగిరి పట్టణం, పరిసర ప్రాంతాలలో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తూ నిత్యం పనిచేస్తున్న స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు సేవ ఎనలేనిదని అన్నారు. మానవసేవే మాధవ సేవ అన్న దృక్పథంతో నేడు వారి సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఈ చిరు సేవా కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్బాబు మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో ప్రముఖ డాక్టర్, మెడికల్ బోర్డు మెంబర్గా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజాసేవ కోసం పరితపిస్తున్న డాక్టర్ పెరుగు మురళీకృష్ణ వారి సతీమణి జన్మదినం సందర్భంగా 11 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంటున్న సీమోనుకు వీల్ చైర్ అందించడం వారి సేవాగుణానికి నిదర్శనం అని అన్నారు. వారు ఇలానే నిరంతరం ప్రజలకు సేవను అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.స్వయంగా డాక్టర్ మురళీకృష్ణ సతీమణి సీమోనును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ సతీమణి హరిత, విద్యాధర్, బాలకృష్ణ, మేకల శ్రీను స్నేహహస్తం సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










