Nov 07,2023 20:53

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
   ప్రమాదవశాత్తు రైలు బండికి ఫ్లాట్‌ ఫామ్‌కు మధ్య పడిన వృద్ధుడు మృతి చెందిన ఘటన ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన వంగపండు సత్యం నాయుడు(67) బొబ్బిలి నుంచి ఏలూరు రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరి వచ్చాడు. ఈ రైలు మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఏలూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరిగి బయలుదేరుతున్న సమయంలో ఆయన నిద్రమత్తులో రైలు బండి దిగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆయన ప్రమాదవశాత్తు రైలు బండికి రైల్వే ఫ్లాట్‌ ఫామ్‌కి మధ్యలో పడిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు అతన్ని బయటికి తీసే సమయంలోనే ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్‌ఐ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి, మంగళవారం రాత్రి బంధువులకు అప్పగించారు.