Nov 10,2023 00:37
ప్రజలతో మాట్లాడుతున్న తిరుపతిరెడ్డి

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: ప్రజల్ని మట్టి పెట్టి ఓట్లు దండుకునే పనిలో బూర్జువా పార్టీలు ఉన్నాయని సిపిఎం సీనియర్‌ నాయకులు సన్నపురెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు మండలంలోని అరివేముల, జంగంవారిపల్లి, చింతలపాలెం, ముండ్లపాడు, గ్రామాలలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు జేబులు నింపే విధానాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ విధానాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి ఉద్యోగ కల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా, నోట్ల రద్దు కారణంగా భారతదేశంలో ఐదు లక్షల పరిశ్రమలు మూతబడితే వాటిని తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం మోడీ చేయడం లేదని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కార్పొరేట్ల దగ్గర నుంచి అక్రమంగా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలను మార్చడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బిజెపి విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. పారిశ్రామిక రంగం కుదేలవుతూ ఉంటే ఉన్న రంగాలని బిజెపి ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాధత్తం చేసి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. బిజెపిని ఓడించకుంటే దేశం సర్వనాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు, నాయకులు బక్కా జేసురత్నం, ఎస్‌ నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.