Oct 17,2023 19:43

వృద్ధులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్న నారాయణ, సర్పంచి, వైద్యులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, సర్పంచి పచ్చర్లపల్లి లక్ష్మీదేవి తెలిపారు. మంగళవారం గుమ్మనూరు గ్రామంలో సర్పంచి లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శి సురేంద్రనాథ్‌, ప్రభుత్వ వైద్యాధికారి జమీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ' జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. కర్నూలు నుంచి వచ్చిన స్పెషలిస్ట్‌ డాక్టర్లు సురబ్‌, మనోజ్‌, సుధా వాణి, మురళీమోహన్‌, జమీల్‌ అహ్మద్‌ 540 మంది పురుషులు, మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ స్టాల్స్‌ ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. గర్భిణులు, బాలింతలకు సూపర్‌వైజర్‌ ప్రసూన న్యూట్రిషన్‌పై అవగాహన కల్పించారు. ఖాజీపురం సర్పంచి రమాదేవి, అసెంబ్లీ బూత్‌ కన్వీనర్‌ రాజన్న, వైసిపి నాయకులు శ్రీధర్‌, నారి, ఎపిఎం నాగార్జున, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.