Jul 27,2023 20:16

ఆస్పరి సచివాలయం

ప్రజాశక్తి - ఆస్పరి
సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజల వద్దకు సేవలు అందించాలని ప్రభుత్వ ఆశయం ఆస్పరి సచివాలయంలో నీరుగారుతోంది. ఆస్పరి మేజర్‌ పంచాయతీ పరిధిలో రెండు గ్రామ సచివాలయాలు నిర్మించారు. ఈ రెండు సచివాలయాల్లో ప్రజలకు ఉపయోగపడే డిజిటల్‌ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సచివాలయం-1లో పని చేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ అర్షియ బతున్‌ బదిలీపై దేవనకొండ మండలం కుంకనూరు గ్రామానికి వెళ్లారు. సచివాలయం-2లో పని చేస్తున్న ఇన్‌ఛార్జీ డిజిటల్‌ అసిస్టెంట్‌ గజేంద్ర కూడా వెల్దుర్తి మండలానికి బదిలీపై వెళ్లడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రజలకు అందుబాటులో లేని సేవలు
ప్రజలకు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, అడంగల్‌, వన్‌ బి, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, రేషన్‌ కార్డ్‌, ఇన్‌కం, క్యాస్ట్‌, ఆధార్‌ అప్‌డేట్‌, నేమ్‌ కరెక్షన్‌, ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ వంటి సేవలకు ప్రజలు దూరమయ్యారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
డిజిటల్‌ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలి
- సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ లక్ష్యం నీరుగారుతోంది. ఆస్పరి సచివాలయం-1, సచివాలయం-2లో డిజిటల్‌ అసిస్టెంట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు లేకపోతే ప్రజలకు సేవలు ఎలా అందిస్తారు. అధికారులు స్పందించి తక్షణమే డిజిటల్‌ అసిస్టెంట్లను నియమించాలి.