
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అన్నారు. మండలంలోని జడ్డంగి పంచాయితీలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ ఆధ్వర్యాన జరిగింది. జడ్డంగి పంచాయతీ పరిధి జమ్మచావిడి, చిన్నయ్యపాలెం, దోనెలపాలెం తదితర గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ నాలుగు సంవత్సరాలు కాలంలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు నగదు ఎంత వచ్చిందో తెలియజేశారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి సరిచేసి అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచులు దాసరి నాగేశ్వరరావు, ఆగూరి సుబ్బలక్ష్మి, కించు రాజేశ్వరి, చంద్రుడు, రాజవొమ్మంగి సీఐ షేక్ బాజీలాల్, జడ్డంగి ఎస్ఐ రఘునాధరావు, ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు, ఐసిడిఎస్ సిడిపిఓ దేవమణి, వైసీపీ నాయకులు దాట్ల వెంకటేశ్వరరాజు, ఎస్.రవి, సిహెచ్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఫోక్స్పేటలో 'జగనే ఎందుకు కావాలి'
రంపచోడవరం : మండలంలోని ఫోక్స్పేట పంచాయతీ దేవరాతి గూడెం గ్రామ సమీపంలోని సమావేశ భవనంలో జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ఫోక్స్పేట గ్రామపంచాయతీ సర్పంచ్ పండా లక్ష్మీ నాగు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపిపి పండా కుమారి, మండల కన్వీనర్ పండా నాగన్న దొర మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.