Nov 01,2023 21:23

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ప్రజల కాంక్షే.. మేకపాటి ఆకాంక్ష..
- నేడు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 53వ జయంతి
- నెల్లూరు నగరంలోని డైకాస్‌రోడ్డులో గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్‌ కళాశాలలో భారీ ఉద్యోగ మేళా : ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆఖరి శ్వాస వరకూ..మెట్ట ప్రాంత ప్రజల కాంక్షే.. ఆకాంక్షగా స్వర్గీయ మేకపాటి గౌతమ్‌రెడ్డి బతికారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వలసలను అరికట్టి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలందించాలన్న ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఉండగా అస్తమించారని ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి తెలిపారు. తన అన్న మరణాంతరం నవంబర్‌ 2న గురువారం దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి జయంతి సందర్భంగా ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాలు, 'జాబ్‌మేళా'లో యువత భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 10గంటలకు నెల్లూరులోని డైకాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం మధ్యాహ్నం ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజనీరింగ్‌ కాలేజీలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి వెల్లడించారు. సైయంట్‌ సెంచరీ ప్లై బోర్డ్స్‌ (ఇండియా) లిమిటెడ్‌, బ్రిటానియా ఇండిస్టీస్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ ప్రైజేస్‌, హ్యమనిఫై ఎఐ, ఇన్నోవసోర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ప్రభాస్‌ వీ హెల్త్‌ క్లీనిగ్‌, వీల్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌, అపోలో ఫార్మసీ, వరుణ మోటార్స్‌, ఫాక్స్‌ కాన్‌, ఇసూజు మోటార్స్‌, నిట్టాన్‌ ఇండియా, హంట్రెట్‌ డౌగ్లస్‌, ఎన్‌.ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, అంబర్‌ ఇండ్రస్టీస్‌, ఆస్ట్రోటెక్‌ స్టీల్‌, ట్రైయూన్‌ టెక్నోఫాబ్‌, బ్లూ ఓషన్‌ పర్సనల్‌, ఫ్లిప్‌కార్ట్‌, సెర్చ్‌ వే గ్లోబల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఎయిర్‌టెల్‌ పెమెంట్స్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, ఆటోసెన్స్‌ ఇండియా, గ్రీన్‌ టెక్‌ ఇండ్రస్టీస్‌, నవతా రోడ్‌ ట్రాన్స్‌ పోర్టు, పేటీయం లాంటి 29 కంపెనీలను ప్రత్యేకంగా యువతకోసం ఒప్పించి తీసుకువచ్చినట్లు ఎంఎల్‌ఎ తెలిపారు. వీటి ద్వారా మెట్ట ప్రాంతంలోని యువతీయువకులకు 2వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎంఎల్‌ఎ విక్రమ్‌ రెడ్డి వివరించారు. ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బిటెక్‌, ఐటీఐ, డిప్లమో, ఎంబిఎ ఫైనాన్స్‌, డిప్లొమో ఇన్‌ మెకానికల్‌, బిటెక్‌ మెకానికల్‌ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలను నిజం చేయడం, ఆత్మకూరు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ అన్నారు. అందులో భాగంగానే ''ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం''ను స్థాపించామని ఆయన గుర్తు చేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు ప్రజలకిచ్చిన హామీని రూ.4కోట్లతో బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి ఇప్పటికే నెరవేర్చామన్నారు. నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చడమే ధ్యేయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఎడిఎఫ్‌ సదస్సులు నిర్వహిస్తూ మేధావులు, నిష్ణాతులతో అభిప్రాయాలు సేకరించి ప్రగతివైపు ప్రణాళికంగా ముందుకు సాగుతున్నామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలిచ్చే నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహక కార్యక్రమాలపై మేకపాటి కుటుంబం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల 58 దేవాలయాల అభివృద్ధి కోసం రూ.5.8 కోట్ల నిధులు సాధించినట్లు స్పష్టం చేశారు.