Oct 24,2023 23:23

ప్రజాశక్తి -ఆలమూరు
సిఎం జగన్‌ ఆదేశాల మేరకు వైసిపి బస్సు యాత్రను నవంబర్‌ 1నుంచి కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రస్థాయి కమిటీల సహకారంతో నిర్వహించబోతున్నారనిప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన సోమవారం ఆలమూరులో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం నందు రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంపై మండల వైసిపి శ్రేణులతో అవగాహనా సదస్సు నిర్వహించారు. ముందుగా ఎంఎల్‌ఎ చిర్ల మాట్లాడుతూ ఈ బస్సు యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. అలాగే ప్రభుత్వం గత 52 నెలలుగా ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ మ్యానిఫెస్టోలో 98 శాతం అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. లబ్ధిదారులు అభివృద్ధిని చూసి మరొకసారి వైసిపి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. పేదల పక్షాన నిలిచేది వైసిపి ప్రభుత్వమేనని, మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారని అన్నారు. అనంతరం గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ
ఆత్రేయపురం ఇండేన్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ రాహుల్‌ గ్యాస్‌ ఉజ్జ్వల పథకంలో మంజూరైన 373 గ్యాస్‌ కనెక్షన్లను ప్రభుత్వ విప్‌ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు.
ఈ సందర్భంగా కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ ఆంధ్ర మరియు తెలంగాణాలో మొట్ట మొదటిసారిగా రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామాన్ని పొగరహిత తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారన్నారు.. దీని నిమిత్తం తూర్పు గోదావరి జిల్లాకలెక్టర్‌ ఉత్తమ గ్యాస్‌ ఏజెన్సీ అవార్డును (ప్రశంసా పత్రం) అందజేశారని అన్నారు. ఉజ్జ్వల 1.0 పథకంలో భాగంగా జిల్లాలోని అత్యధిక కనెక్షన్లు 1250 రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని లబ్ధిదారులకు అందజేశారని అన్నారు. ప్రస్తుతం ఉజ్జ్వల 2.0 పథకంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో లబ్ధిదారులకు కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపిలు, వైస్‌ ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ప్రజలు, స్థానిక నాయకులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, రాహుల్‌ ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ అధినేత కె.వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.