
జిల్లాలో ముగిసిన బస్సుయాత్ర
ప్రజాసమస్యలే ఎజెండాగా 12 మండలాల్లో సాగిన యాత్ర
యాత్రకు ఘనస్వాగతం, తొమ్మిదిచోట్ల సభలు
నిర్వాసితుల సమస్యలు, చింతలపూడి ప్రాజెక్టు, ఎర్రకాలువ భూములపై వినతుల వెల్లువ
ఏజెన్సీలో ఆయుధ కర్మాగారం ఏర్పాటు, ఎల్టిఆర్, పోడు భూములకు పట్టాలు కోరుతూ కదలిన జనం
పేద కుటుంబానికి రెండెకరాల భూమి, ఇల్లు నినాదాలతో దద్దరిల్లిన యాత్ర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎక్కడిక్కడే జనం ఎదురేగి తమ సమస్యలపై యాత్ర బృందానికి వినతులు అందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను సైతం జనం యాత్ర బృందం వద్ద ఏకరువు పెట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వంలో సాగిన ఈ యాత్ర జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకూ మూడురోజుల పాటు సాగింది. ఏజెన్సీ ప్రాంతం కుక్కునూరులో ప్రారంభమైన యాత్ర వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, పెదవేగి మీదుగా జిల్లా కేంద్రం ఏలూరుకు చేరుకుని అక్కడనుంచి కృష్ణాజిల్లాలోకి వెళ్లింది. బస్సుయాత్రలో దాదాపు తొమ్మిదిచోట్ల బహిరంగసభలు జరిగాయి. పలుచోట్ల స్వాగత కార్యక్రమాలు కొనసాగాయి. బుట్టాయగూడెం, చింతలపూడిలో జరిగిన విలేకరులు సమావేశంలో యాత్ర రథసారధి వి.శ్రీనివాసరావు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నతీరు, ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం తీరును వెల్లడించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేనల దాసోహం ఎందుకు అవుతున్నాయంటూ నిలదీశారు. సిపిఎం చేపట్టిన బస్సుయాత్రకు స్థానిక ప్రజానీకం తిలకం దిద్ది, హారతులిచ్చి ఆహ్వానాలు పలికారు. పోలవరం నిర్వాసితుల పరిహారం సమస్యను యాత్ర బృందానికి బాధితులు వివరించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పునరావాస పరిహారం రూ.పదిలక్షలు, భూములకు ఇస్తామన్న రూ.ఐదు లక్షల పరిహారం, 18 ఏళ్లు నిండిన యువతకు రావాల్సిన పరిహారం, నిర్వాసితల కాలనీలో తాగునీరు, రోడ్లు, వసతుల సమస్యలను యాత్ర బృందం వద్ద బాధితులు ఏకరువుపెట్టారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వ తీరును యాత్రలో పాల్గొన్న నాయకులు ఎండగట్టారు. జీలుగుమిల్లిలో 1200 ఎకరాల గిరిజననుల భూములను సేకరించి ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు చేస్తున్న సన్నహాలపైన స్థానిక ప్రజానీకంలో ఆందోళన వ్యక్తమైంది. యాత్ర బృందం వద్ద తమ సమస్యను స్థానిక ప్రజానీకం చెప్పుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. బుట్టాయగూడెం మండలంతోపాటు, ఏజెన్సీలో ఎల్టిఆర్ భూములు, పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలివ్వకపోవడం వంటి సమస్యలు బృందానికి స్థానికులు వివరించారు. కొయ్యలగూడెంలో స్థానికంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం, 30 పడకల ఆసుపత్రిపై నిర్లక్ష్యం వంటి సమస్యలను స్థానికులు బృందం దృష్టికి తెచ్చారు. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం వంటి మండలాల్లో ఎర్రకాలువ మిగులు భూములు 2500 ఎకరాలను పేదలకు పట్టాలివ్వాలంటూ జనం నినదించారు. ప్రతినిరుపేద కుటుంబానికి రెండు ఎకరాల భూమి, ఇల్లు ఇవ్వాలన్న నినాదాలు యాత్రలో మార్మోగాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో రైతులకు న్యాయం జరగలేదంటూ బాధిత రైతులు వినతిఇచ్చారు. చింతలపూడిలో బస్సు డిపో లేకపోవడం వంటి సమస్యలను సైతం బృందం దృష్టికి తెచ్చారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే చింతలపూడి ఎత్తిపోతలను వెంటనే పూర్తిచేయాలంటూ వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెదవేగి మండలం విజయరాయిలో కొబ్బరి రైతులు తమసమస్యలను బృందానికి వినతిరూపంలో అందించారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మెప్మా సిబ్బంది, సిపిఎస్ ఉద్యోగులు ఇలా ఎంతోమంది తమసమస్యలను నాయకులకు విన్నవించి వినతులు అందించారు. జిల్లా కేంద్రంలో ఏలూరులో నిర్మించిన ఆరువేల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడాన్ని నాయకుల తీవ్రంగా తప్పుపట్టారు. పోణంగిలోని టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు. అడవిలా పేరుకుపోయిన పిచ్చిమొక్కలను, దెబ్బతింటున్న ఇళ్లను చూసి నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా సాగిన ఈ యాత్ర జిల్లాలో దిగ్విజయంగా సాగింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని యాత్ర బృందం భరోసా ఇచ్చింది. యాత్రకు సిపిఎం జిల్లాకార్యదర్శి ఎ.రవి ఎక్కడికక్కడే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ ముందుకు నడిపించారు. పలుసభల్లో జాతీయ నాయకులు బి.వెంకట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, ఆశోక్, రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, జిల్లా నాయకులు ఎం.నాగమణి, డిఎన్విడి.ప్రసాద్, కె.విజయలక్ష్మి, కె.శ్రీనివాస్, పి.కిషోర్, వివిధ మండలాలకు చెందిన సిపిఎం కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.