
ప్రజాశక్తి-అమలాపురం
లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం విజయవాడలో నవంబర్ 15న నిర్వహించే సిపిఎం ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చింతకాయల బాబూరావు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా స్థాయి శిక్షణా తరగుతులు స్ధానిక గొల్లగుడెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా నేటికీ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా విశాఖ ఉక్కును కూడా అమ్మడానికి తయారైందన్నారు. ఈ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేస్వరరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందన్నారు. విద్వేషరాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందన్నారు. బిజెపి వల్ల మైనార్టీలకు రక్షణ కరువైందన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు. ప్రశ్నించిన వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తుందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ప్రశ్నించలేని వైసిపి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ బేరీ బస్ యాత్ర నవంబర్ 7న జిల్లాలో పర్యటిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా రావులపాలెం, అమలాపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ శిక్షణతరగతుల్లో కెవివి.సత్యనారాయణ, జి.దుర్గా ప్రసాద్, సూర్యప్రకాశరావు, వి.రాంబాబు, పాము బాలయ్య, కుడిపూడి రాఘవమ్మ, బి.శ్రీను, పిశేషారావు తదితరులు పాల్గొన్నారు.