
ప్రజాశక్తి-దర్శి: రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధన కోసం ప్రజా రక్షణ భేరిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీఎం కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. శుక్రవారం సీపీఎం దర్శి మండల కార్యకర్తల సమావేశం సుందరయ్య భవనంలో పార్టీ సీనియర్ నాయకులు సందు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతూ పంటలు దెబ్బతినడం, అధిక ధరలు, ఛార్జీల భారాలతో సతమతమవుతుంటే అధికార పార్టీకి ఇవేమీ పట్టకుండా వ్యవహరించడం విచారకరమని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5.30 లక్షల ఎకరాల్లో జిల్లాలో పంటలు సాగు చేయాల్సి ఉండగా, 2.17 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారని అన్నారు. అందులో 50 శాతానికి పైగా ఎండిపోయాయని, రబీ సీజన్లో ఇప్పటికీ వర్షాలు పడలేదని అన్నారు. రాష్ట్రంలో నీటి వనరులు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. గోదావరి ద్వారా ఈ ఏడాది 1500 టీఎంసీలు సముద్రం పాలు అయ్యాయని అన్నారు. అన్నింటి మీద ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రజారక్షణ భేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 10,11,12వ తేదీల్లో ప్రచార జాతాలు, కరపత్రాల ప్రణాళికలను ప్రజలకు వివరిస్తామని తాండవ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేవీ పిచ్చయ్య, నాగేశ్వరరావు, ఉప్పు నారాయణ, ఎస్కే కాలేబాషా, ఉప్పుటూని నాగరాజు, తాండవ రంగనాయకులు, లక్ష్మీ, నారాయణమ్మ, పద్మావతి, కార్యకర్తలు పాల్గొన్నారు.