
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా
ప్రజా సమస్యల పరిష్కారం: జెసి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలని, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించాలని తలపెట్టిందో ఆ ఉద్దేశ్యం నెరవేర్చేలా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసమస్యల పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెసితోపాటు నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. జెసి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వారంలో రెండురోజులు క్షేత్రస్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వచ్చే వినతులను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పరిష్కరించిన వినతులపై శాఖాధిపతులు తప్పనిసరిగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్య పరిష్కరించారో లేదో చూడాలన్నారు. ప్రజా సమస్యలను చిన్న కారణాలతో రిజెక్ట్ చేయవద్దని, వాటిని పరిష్కరించేందుకు వీలైన మార్గాలను అర్జీదారులకు తెలియ చెప్పాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు విధిగా తమ పరిధిలోని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని వాటికి సంబంధించి సరైన కారణాలను తప్పకుండా చెప్పాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పరిష్కరించిన అర్జీలపై రెండు వారాల తర్వాత సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కమిషనర్ అరుణ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి వీలుగా క్షేత్రస్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల నుంచి వచ్చే వినతులను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హౌసింగ్, డిఆర్డిఎ, మెప్మా పిడిలు పద్మనాభం, తులసి, రాధమ్మ, ఆర్డిఓ చెన్నయ్య, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి దేవి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్య, సహకార శాఖల అధికారులు మురళీ కష్ణ, మధుసూధనరెడ్డి, డాక్టర్ ప్రభాకర్, రవి కుమార్, బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.