
అనగనగా ఒక పట్టణ శివారులో శివన్న, మాదన్న అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఎదురెదురు ఇళ్లల్లో కాపురం చేస్తుండేవారు. శివన్న వ్యాపారస్తుడు కావడంతో బాగా డబ్బు సంపాదించాడు. ఇతనికి ఒక్కగానొక్క కుమారుడు సురేష్. చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మాదన్న వ్యవసాయదారుడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందిపడేవాడు. ఇతని కుమారుడి పేరు రాజు. ఎదురెదురు ఇళ్లు కావడంతో సురేష్, రాజు కలిసి బడికి వెళ్లే వాళ్లు.. కలిసే ఆటలాడుకునే వాళ్లు.
కొద్దిరోజులు గడిచాక సురేష్, రాజు జత మానేశాడు. ఇంటి పట్టునే ఉండి పోసాగాడు. రాజు మాత్రం కాసేపు చదువుకుని, అలా చల్లటి గాలికి బయటకి వచ్చేవాడు. శివన్న కొత్త సెల్ఫోన్ కొనడంతో సురేష్ అందులో గేమ్స్, వగైరా చూస్తూ ఇంట్లోనే కాలం వెళ్లబుచ్చేవాడు. కాసేపైనా పుస్తకాలు చేతపట్టేవాడు కాదు. పొద్దస్తమానం సెల్ఫోన్లో నిమగమై పోతుండడంతో తల్లి పార్వతి సురేష్ని మందలించేది. 'ఎప్పుడు చూసినా సెల్ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటావు.. ఇంక చదువుకునేదెప్పుడు? పోయిన పరీక్షల్లో మార్కులు తగ్గిపోయాయి!' అంటూ మందలించేది.
'పిల్లల్ని కాలాన్ని బట్టి పెంచాలి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. వాడు ఎప్పటిలా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే, భవిష్యత్తులో పైకి రాలేడు. కాలాన్ని బట్టి పిల్లల ప్రవర్తనలో మార్పు రావాలి. ఎదురింటి మాదన్న కొడుకు రాజుని చూడు.. వట్టి అమాయకుడు, ఏమీ తెలీదని అందరూ అనుకుంటున్నారు. మనవాడు అలాకాకూడదు పార్వతీ!' అని సర్ది చెప్తుండేవాడు శివన్న. తన స్నేహితుడైన సురేష్ చేతిలో సెల్ఫోన్ చూసి ఎదురింటి రాజు కూడా సెల్ఫోన్ కావాలని తండ్రిని మారాం చేసేవాడు. దానికి మాదన్న 'వాళ్ల నాన్న వ్యాపారంలో బాగా సంపాదిస్తాడు. మనం రైతులం.. బాగా చదువుకొని, ఉద్యోగం తెచ్చుకో! అప్పుడు మంచి సెల్ఫోన్ కొనుక్కోవచ్చు' అని సర్ది చెప్పేవాడు. తండ్రి చెప్పినట్టే విని బాగా చదవసాగాడు రాజు.
సురేష్ మాత్రం సెల్ఫోన్కు అలవాటు పడిపోయి, బడికి వెళ్లాలంటే ఇష్టపడేవాడు కాదు. బలవంతం మీద వెళ్లినా ఇంటికి రాగానే సెల్ఫోన్ తీసుకుంటే భోజనం చేయడానికీ వెళ్లేవాడు కాదు. కొన్నాళ్లు గడిచాయి. యుక్త వయసు రాగానే మరింత ఖరీదైన ఫోన్ కొనుక్కున్నాడు సురేష్.
తన స్నేహితుడు రాజు మాత్రం బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. సురేష్ మాత్రం సెల్ఫోన్కు అలవాటుపడి, సరిగా చదవక పోవడంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉండిపోయాడు. సురేష్ తెలివైనవాడు అనుకున్న ఊరి జనం, సెల్ఫోన్ పిచ్చి వల్ల చదువు పోయి, ఎందుకూ పనికిరాకుండా పోయాడని దెప్పిపొడవడం మొదలుపెట్టారు. 'నేను మొదటి నుండీ చెబుతూనే ఉన్నాను. సెల్ఫోన్ అవసరానికే పిల్లలకు ఇవ్వాలి తప్ప, టైం పాస్ కోసం ఇవ్వకూడదని.. తెలివి వస్తుంది అనుకున్నారు. పిచ్చి ముదిరిపోయి, ఉన్న చదువు కాస్తా ఊడింది. ఎందుకూ పనికి రాకుండా పోయాడు. అతి గారాబం వల్ల వాడి జీవితానికే ముప్పు వచ్చింది. ఎదురింటి రాజు చూడు బాగా చదివి, ఉద్యోగం తెచ్చుకుని మంచి సెల్ఫోన్ కొనుక్కున్నాడు. పిల్లలకు ఏది ఎప్పుడు అవసరమో అదే ఇవ్వాలి. పరిమితి మించిపోతే ఇలా ఎందుకూ పనికిరాని వారిగా తయారవుతారు' అంటూ మండిపడింది పార్వతి. చేసిన పొరపాటుకు బాధపడి, చేసేది లేక కనీసం కొడుకుని తనతోపాటు తీసికెళితే.. వ్యాపారమైనా నేర్చుకుంటాడని భావించాడు శివన్న.
నరెద్దుల రాజారెడ్డి
96660 16636