Nov 07,2023 00:04
యర్రగొండపాలెం నియోజకవర్గంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న గూడూరి ఎరిక్షన్‌బాబు

ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయని, ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై రోజుకో కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి సీనియర్‌ నాయకులు శ్యామల కాశిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వెదుళ్ల చెరువు, గుడిపాటిపల్లి గ్రామంలో 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇసుక ఇస్తే కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆయనపై కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. జగన్‌ ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రజల సొమ్ములను రకరకాలుగా దోచుకున్నారని అన్నారు. వైసిపి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకొనిపోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, కనిగిరి నియోజకవర్గంలో డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ఆయన అన్నారు. నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, మండల రైతు అధ్యక్షుడు మీనుగ కాశయ్య, మండల బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాజగోపాల్‌, తగరం అంకయ్య, టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: దళితుల సంక్షేమాన్ని విస్మరించి సామాజిక యాత్రలు చేయడం ఎంత వరకు సబబని టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛారిర్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని నర్సాయిపాలెం గ్రామంలో 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' అనే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టోను వివరించారు. కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసినట్లు ఆరోపించారు. బెస్ట్‌ అవైలబుల్‌ పథకం రద్దు చేసి పేదల కడుపు కొట్టారని అన్నారు. పేదింటి ఆడపిల్లలకు ఆదుకున్న పెళ్లికానుక, దూల్హన్‌, తోఫా పథకం రద్దు చేసి పేదల సహాయం అడ్డుకున్నారని పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు మంజూరు చేయలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా టిడిపి ప్రభుత్వం ఇన్నోవా కార్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం ఉపాధిని ఇవ్వలేదని అన్నారు. పశ్చిమ ప్రాంతంలో దళిత ప్రజలు పనులు లేక వలసలు పోతున్నారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ నీరు ఇవ్వని మంత్రులు సామాజిక యాత్ర ఎలా చేపడతారని ప్రశ్నించారు. గ్రామాలు గొంతెండి చస్తుంటే పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, మంత్రూ నాయక్‌, సంజీవరెడ్డి, తోటా మహేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.