Nov 07,2023 00:16
సాగుకు సిద్ధం చేసిన భూమిలో నిలిచిన వర్షపు నీరు

ప్రజాశక్తి-టంగుటూరు: గత ఆదివారం రాత్రి, సోమవారాలలో మండలంలో కురిసిన భారీ వర్షం రైతన్నలకు ఊపిరి పోసినట్లుగా ఉందని మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకీడిస్తున్న రైతుల కు ఈ వర్షం ఎంతో ప్రయోజన కరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నాట్ల కోసం పొలాలు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు ఈ వర్షంతో నాట్లకు సంసిద్ధులయ్యారు. మండలంలో ప్రధానంగా పొగాకు, శనగ, మినుము, కంది, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఈ వర్షం వల్ల ఇప్పటికే సాగు చేసిన కంది పంటలతో పాటు మిగిలిన అన్ని రకాల పంటల రైతులకు ప్రయోజనకరంగా ఉంది. అదే విధంగా నాట్లు కోసం సిద్ధం చేసుకున్న పొలాలు ఈ వర్షంతో బాగా పదును అయినట్లు చెబుతున్నారు. మిగిలిన ఇతర పంటలతో పోల్చుకుంటే పొగాకు రైతులకు ఈ వర్షం బాగా ప్రయోజనకరంగా ఉంది. పొగనారు సాగు చేసిన రైతులు వర్షంతో నారు పీకేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పొగనాట్లు వేసేందుకు కూడా పొగాకు రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుని ఉన్నారు. 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన టంగుటూరు మండలంలో రైతులు వర్షం పట్ల హర్షం వ్యక్తం చేస్తుండగా సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా టంగుటూరు శివారు కాలనీలుగా ఉన్న పోతుల చెంచయ్య వెస్ట్‌ కాలనీ, బుచ్చిరాజుపాలెం, రావివారిపాలెం, బాబుజి కాలనీల ప్రజలు వర్షం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే ఈ కాలనీ రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఆటకంగా ఉన్నాయి. కాలనీలోని అంతర్గత రోడ్లన్నింటిలో నీరు నిలిచి బురదమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ చేరిన నీటితో శివారు కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అధికారులు శివారు కాలనీలపై దృష్టి సారించి ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.