Oct 30,2023 23:40

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌సి ఐవి

ఆర్‌టిసి డ్రైవర్‌పై దాడి దారుణం
విలేకర్ల సమావేశంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - అమలాపురం
ఆర్‌టిసిని పిటిడిగా మార్చిన తర్వాత డ్రైవర్లకు అప్పటిదాకా పొందుతున్న అలవెన్సులు కొనసాగించాలని, రద్దు చేసిన అలవెన్సులను పునరుద్ధరించాలని పిడిఎఫ్‌ తరఫున కౌన్సిల్లో ప్రస్తావించామని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అమలాపురం యుటిఎఫ్‌ హోమ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌టిసిగా ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు టిక్కెట్‌కు అర్ధరూపాయి, ఆపై సర్వీసులకు రెండు రూపాయల వరకు ట్రిమ్స్‌ అలవెన్స్‌ ఇచ్చేవారన్నారు. ఈ రకంగా నెలకు రూ.1000వరకూ కార్మికులు పొందేవారన్నారు. నైట్‌ అవుట్‌ డ్యూటీకి రూ.100 ఇచ్చేవారన్నారు. జగన్‌ ప్రభుత్వం వీటిని రద్దు చేసిందన్నారు. డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ డ్యూటీ చేసే డ్రైవర్లకు ఈ అలవెన్సులను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. డ్రైవర్లకు ఎనిమిది గంటలు డ్యూటీ నిర్ణయించారని, కాని దూరపు సర్వీసులు 36 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంద న్నారు. ఈ డ్యూటీ భారం తగ్గించాలన్నారు. కావలి మద్దూరుపాడు ఆర్‌టిసి డ్రైవర్‌పై జరిగిన దాడిని రవాణా శాఖ మంత్రి ఖండించాలని, దోషులని శిక్షిస్తామని ఉద్యోగులకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ మేరకు పిటిడి మంత్రి, కమిషనర్‌కు లేఖలు రాశామని తెలిపారు. ఆయన వెంట ఆర్‌టిసి జెఎసి నాయకులు ఉన్నారు.