Nov 09,2023 21:25

రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీకి జగన్‌ సాగిలం
పాచిపోయిన లడ్డు అన్నవారే నేడు మోడీ భజన
ప్రజారక్షణ భేరీ యాత్రలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/కలిదిండి

అభివృద్ధి చెందడమంటే కార్పొరేట్లు అభివృద్ధి చెందడం కాదని, ప్రజల ఎదుగుదలే నిజమైన అభివృద్ధి అని, పాలకులు చెబుతున్న అభివృద్ధి సామాన్యులకు చేరడంలేదని, సమగ్ర అభివృద్ధి అసమానతల్లేని సమాజం కోసమే ప్రజారక్షణ భేరీ యాత్ర చేపట్టినట్లు సిపిఎం రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు అన్నారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర పశ్చిమగోదావరిర జిల్లా భీమవరం నుంచి ఉండి, ఆకివీడుమీదుగా ఏలూరు జిల్లా కలిదిండికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎస్‌.మహంకాళిరావు అధ్యక్షతన జరిగిన సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్‌ లోటు, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు విడుదల వంటివి ఏ ఒక్కటీ మోడీ సర్కార్‌ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తుందని విమర్శించారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేసేందుకు చూస్తున్నారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్‌ కోడ్‌లు, రైతులకు వ్యతిరేకంగా మరో మూడు నల్లచట్టాలు, విద్యుత్‌ సంస్కరణలను కేంద్రం తెచ్చిందన్నారు. రాష్ట్ర హక్కులను కాలరాసి తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రశ్నించాల్సిన జగన్‌ బిజెపికి సాగిలాపడుతున్నారని విమర్శించారు. ప్రజలకు నష్టం చేకూర్చే చట్టాలకు పార్లమెంట్‌లో మద్దతిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బిజెపి ముందు మోకరిల్లుతుండగా, పాచిపోయిన లడ్డు అని చెప్పిన పవన్‌కల్యాణ్‌ మోడీ మళ్లీ రావాలంటూ భజన చేస్తున్నారన్నారు. వీరంతా తోడుదొంగలని ఇది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ బిల్లులు అన్నీ పెంచేశారని, వీటి తగ్గింపునకు సిపిఎం ప్రత్యామ్నాయం చూపుతుందని వివరించారు. కేరళలో మద్దతు ధరకు అదనంగా పంటలకు రూ.750 ఇస్తుందన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది స్కీమ్‌ వర్కర్లు ఉన్నారని, వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కోటిమంది అసంఘటితరంగ కార్మికులున్నారని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పి 2024లో ఓట్ల కోసం ప్రణాళికలు రచించారన్నారు. మణిపూర్‌లో మహిళలపై దాడులు జరిగినా ఇక్కడ వైసిపి, టిడిపి, జనసేన ఒక్క మాటమాట్లడటం లేదన్నారు. ఇది సరైందికాదని, విధానాలు మారాలన్నారు. ఈనెల 15న విజయవాడలో బహిరంగ సభకు అందరూ తరలిరావాలన్నారు.
సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఇతర పార్టీలు చేసే యాత్రలు జనంకోసం కాదని అధికారం కోసమేనన్నారు. దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అసమానతలుపోయి సమానత్వం కోసం సిపిఎం యాత్ర చేస్తుందని తెలిపారు. రైతులు కష్టపడి పండిస్తే కొనేవారు ఉండరని, డబ్బులు రావని, ధరలో కోత పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని తెలిపారు. ఆక్వా కంపెనీలు సిండికేట్‌గా మారిపోయాయన్నారు. రైతులకు ఇచ్చే కరెంటు రాయితీలు ఆపేశారన్నారు. కొల్లేరు ఆపరేషన్‌తో ఎంతోమంది ఉపాధి దెబ్బతినిందన్నారు. కలిదిండిలో ఆక్వా పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంతోపాటు, ఉపాధి కల్పించాలని, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరారు. ఏలూరుజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసమస్యలు పేరుకుపోయాయన్నారు. పాలకపార్టీలు పట్టించుకోవడంలేదని, తాగునీరు కూడా అందడంలేదన్నారు. అక్రమంగా ఫ్యాక్టరీలు నిర్మించడంతో కాలుష్యం పెరిగిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాల పట్టాలకోసం, స్కీమ్‌ వర్కర్లు యాత్ర బృందానికి వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, సిపిఎం రాష్ట్ర నాయకులు కె.ధనలక్ష్మి, ఎం.హరిబాబు, కె.శ్రీనివాసరావు, జిల్లా నాయకులు సిహెచ్‌.బాబూరావు, గోపాలన్‌, సిపిఎం నాయకులు వి.భాస్కరరావు, ఎ.వెంకటేశ్వరరావు, డి.వెంకటసత్యన్నారాయణ, కె.శ్రీనివాసరావు, జి.అనిల్‌ కుమార్‌, జోగి ఏసు, చిన్నం మాధవ, కనకారావు, గోసంగి వినోద్‌, వి.వరలక్ష్మి, కె.రమేష్‌, పి.రామకృష్ణ, పి.సత్యనారాయణ, కె.గాంధీ, పి ప్రకాష్‌, కె వెంకటేశ్వరరావు, జె.పెద్దిరాజు పాల్గొన్నారు.
యాత్రకు ఘన స్వాగతం
బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుండి ఏలూరు జిల్లాలోని కలిదిండి మండలం ఉప్పుటేరు వంతెన వద్దకు ప్రవేశించగానే సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మూలలంక, చినతాడినాడ, కోరుకొల్లు, కలిదిండి శాఖా కార్యదర్శులు, సభ్యులు, అభిమానులు బైక్‌ ర్యాలీగా తరలి వెళ్లి స్వాగతం పలికారు. కలిదిండి ప్రధాన సెంటర్‌ వరకూ ర్యాలీగా తరలి వచ్చారు.
సమస్యలపై పోరాడాలని వినతులు
బస్సు యాత్రలో పాల్గొన్న నాయకులకు మండలంలోని మూలలంక, భాస్కరరావు పేట, సంతోషపురం, అమరావతి, కోరుకొల్లు గామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు వందేళ్లకు పైగా ఇరిగేషన్‌ భూముల్లో నివాసముంటున్న తమకు పట్టాలు మంజూరు చేయాలని ఆయా గ్రామస్తులు, అలాగే ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనాలు రు.25 వేలు అమలు చేయించడంతో పాటు సామాజిక భద్రత కల్పించాలని, వేతనాలతో పాటు గ్రాడ్యుటీ ఇవ్వాలని, తదితర సమస్యలతో కూడిన వినతులు అందజేశారు.
ఆకట్టుకున్న ప్రజా నాట్యమండలి కళారూపాలు
ప్రజా రక్షణభేరీ బస్సుయాత్రలో భాగంగా తొలుత సభా ప్రాంగణానికి ప్రజా నాట్య మండలి కళాకారులు చేరుకున్నారు. ప్రజా సమ్యలపై ప్రజానాట్యమండలి కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. నృత్యాలు చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పాటల ద్వారా వివరించారు. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.