పాలకొండ రూరల్: ఇంటింటికీ వెళ్లి చేపడుతున్న ఓటరు సర్వేను పారదర్శకంగా చేపట్టాలని పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. మండలంలోని బెజ్జిలో జరుగుతున్న ఓటరు సర్వేను గురువారం ఆమె పరిశీలించారు. 202 పోలింగ్ బూత్లో ఓటర్ సర్వేను పరిశీలించి ఓట్లను తొలగించేటప్పుడు నిబంధనల ప్రకారం చేయాలని బిఎల్ఒలకు సూచించారు. కొత్తగా ఓట్లను నమోదు చేయడం, ఫొటోలు సరిగ్గా లేని ఓటర్ల వారీగా మళ్లీ ఫొటోలు తీసుకొని వాటిని సరిచేయాలని అన్నారు. అనంతరం బెజ్జి, తుమరాడలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాలను పరిశీలించారు. సెప్టెంబర్ 15 నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. అలాగే టిడి పారాపురంలో 203 పోలింగ్ బూత్ ఓటర్ సర్వేను పరిశీలించారు. రాజకీయ పార్టీలు చెప్పిన సమస్యలను పరిష్కరించి ఓటర్ సర్వేను వేగవంతం చేస్తామని అన్నారు. అనంతరం తంపటాపల్లిలో హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించారు. లే అవుట్లో మంజూరైన అన్ని గృహాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎఇకి సూచించారు. అలాగే తహశీల్దార్, ఎంపిడిఒలు లే అవుట్ను సందర్శించి తాత్కాలిక రోడ్డు సదుపాయం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించి సెప్టెంబర్ 15 నాటికి అప్పగించాల న్నారు. కార్యక్రమంలో పాలకొండ హౌసింగ్ ఎఇ బి.మాధవరావు, ఎన్నికల డిటి, ఇతర ఎన్నికల, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










