
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో గత ప్రభుత్వం రూ.10 లక్షలు ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన పార్కు కళ తప్పింది. పంచాయతీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పార్కులోకి అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో ఎండిపివో, ఎంపిపి, హౌసింగ్, ఐసీడీఎస్, ఎంఈవో, వ్యవసాయ శాఖ, ఏడీఏ, అగ్రిటెక్, రైతు భరోసా, చెంచు సమైఖ్య, సచివాలయం 3, 4. పశు వైద్యశాల తదితర కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం వందలాది మంది వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పనుల నిమిత్తం అక్కడకు వస్తుంటారు. వీరితో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంంత్రం వంద మంది దాకా ఆ మార్గం గుండా వాకింగ్కు వెళ్తుంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం రూ.10 లక్షలు ఉపాధి నిధులతో 1.10 ఎకరాల విస్తీర్ణంలో పార్కును ఏర్పాటు చేసింది. కూర్చునేందుకు బల్లలు వేశారు. గేటు బిగించారు. మంచి మంచి మొక్కలు నాటారు. పార్కు బాగా అభివృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో దానిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీనిలో గడ్డి ఏపుగా పెరిగి విష పరుగులకు ఆవాసంగా మారింది, గేటు తెరిచే వారు కరువయ్యారు. ప్రస్తుత పాలకులు పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది. అధికారులు, పాలకులు స్పందించి పార్కును అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.