
ప్రజాశక్తి-దర్శి: ఓటర్ల జాబితా సవరణలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, తహశీల్దార్లు సహకరించాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరావు అన్నారు. దర్శి నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల తహశీల్దారు వెంకటేశ్వర్లు అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్వో లోకేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వచ్చే నెల 9వ తేదీ నాటికి బీఎల్ఓల ద్వారా అభ్యంతరాలు తెలపాలని కోరారు. క్లైమ్లు, అభ్యంతరాలకు చివరి తేదీ 26 డిసెంబర్ అని తెలిపారు. జనవరి 1నాటికి ఓటర్ల జాబితా ప్రచురించేం దుకు ఈసీఐ అనుమతి గడువు ఉంటుందన్నారు. జనవరి 5వ తేదీన ప్రచురిస్తారని తెలిపారు. ఈ తేదీలను రాజకీయ పార్టీలు గమనించి చేర్పులు, మార్పులు తొలగింపులు బీఎల్ఓల ద్వారా పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు తహశీల్దారు ప్రసాద్, కురిచేడు తహశీల్దారు జ్వాలా నరసింహం, దర్శి ఎలక్షన్ డీటీ దేవప్రసాద్, రాజకీయ పార్టీల నాయకులు వైసీపీ టి చంద్రశేఖర్, టీడీపీ చిట్టే వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కొండారెడ్డి, బీజేపీ గురువర్జనరావు, సీపీఐ జూపల్లి కోటేశ్వరరావు, జనసేన పాపారావు పాల్గొన్నారు.