Sep 23,2023 21:23

తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఫ్యాప్టో నాయకులు

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయంగా ఉన్న సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపిఎస్‌)ను అమలు చేయాల్సిందేనని ఫ్యాప్టో నేతలు డిమాండ్‌ చేశారు. జిపిఎస్‌ అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఎస్‌.సిరాజుద్దీన్‌, సెక్రటరీ జనరల్‌ జి.లింగమూర్తి, ఏపిసిపిఎస్‌ఇఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రామన్న, ఎపిఎన్జీఓ సంఘం నగర అధ్యక్షులు ఎం.మనోహర్‌రెడ్డి, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కో ఛైర్మన్‌ జావీద్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికల హామీ మేరకు ఓపిఎస్‌ అమలు చేయాల్సిందే అన్నారు. బలవంతంగా జిపిఎస్‌ అమలు చేస్తామంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒప్పుకునేది లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 25న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాప్టో నాయకులు కులశేఖర్‌రెడ్డి, సూర్యుడు, రామాంజి, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.