Sep 22,2023 21:27

గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-డి.హీరేహాల్‌   రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను వెంటనే రద్దు చేసి ఓపిఎస్‌ను అమలు చేయాలని ఎపిటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్‌ మండల అధ్యక్షులు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఓపిఎస్‌ను అమలు చేయాలన్నారు. సిపిఎస్‌ను అమలు చేయడం ద్వారా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సిపిఎస్‌ను రద్దు చేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి జాఫర్‌, హీరాలప్ప, సరోజమ్మ, శ్రీనాథ్‌, హనుమంతప్ప, తదితరులు పాల్గొన్నారు.