ప్రజాశక్తి - గోనెగండ్ల
తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఈడిగ ఉపేంద్ర, రామానాయుడును కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు మారేష్ డిమాండ్ చేశారు. బుధవారం గోనెగండ్లలోని బస్టాండ్లో వారు విలేకరులతో మాట్లాడారు. పొలం పనులకు వెళ్లిన దళిత మహిళ నోట్లో నిందితులు గుడ్డలు కుక్కి అత్యాచారం చేసి, సెల్ ఫోన్లో చిత్రీకరించారని తెలిపారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చర్మకారుల సంఘం నాయకులు నరసన్న, పెద్ద కొండయ్య, ఆటో యూనియన్ నాయకులు తేజ, రంగ, కులుమాల ఖాజా, పారిశుధ్య కార్మికుల సంఘం సభ్యులు లింగన్న పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కరుణాకర్










