May 18,2023 22:19

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

అమడగూరు : నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కదిరి మండల విద్యాశాఖ అధికారి చెన్నకృష్ణకు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడుతూ కదిరి పట్టణంలో మే 14న శ్రీ చైతన్య స్కూల్‌ సిబ్బంది పాంప్లెట్లు పంచుతూ ఇంటింటికి తిరిగి అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్‌ ముందు ధర్నా నిర్వహించినా పాఠశాల యాజమాన్యం యథేచ్చగా అడ్మిషన్లు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజరు కుమార్‌, యశ్వంత్‌, తదితరులు పాల్గొన్నారు.