Nov 15,2023 22:51

శంకుస్థాపన చేస్తున్న చైర్మన్‌ గిరిబాబు

* 'ప్రజాశక్తి' కథనానికి స్పందన
ప్రజాశక్తి- పలాస: 
నెహ్రూ పార్కును సుందరంగా, ఆధునిక హంగులతో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు అన్నారు. ఈ నెల 6న 'ప్రజాశక్తి'లో 'రూపం కోల్పోయిన నెహ్రూ పార్కు' కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పురపాలక సంఘం అధికారులు స్పందించారు. రూ.పది లక్షలు నిధులు మంజూరు చేశారు. దీంతో పనుల ప్రారంభానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్కు చుట్టూ లైటింగ్‌, కోనేరులో స్టెప్స్‌, కూర్చోడానికి టేబుళ్లు, తాగునీరు తదితర పనులు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. పలాస మున్సిపాలిటీలో ఏకైక పార్కు నెహ్రూ అని, ఈ పార్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, మన్మథ పాల్గొన్నారు.