Jul 20,2023 20:52

గ్రామస్తులతో మాట్లాడుతున్న పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి

ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని బిల్లేకల్‌ గ్రామంలో నేరాల నియంత్రణకే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ను డీఎస్పీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిల్లేకల్‌ సమస్యాత్మక గ్రామం కావడంతో మొహర్రం పండగ సందర్భంగా ప్రజల రక్షణ, భద్రత, సెన్స్‌ ఆఫ్‌ సెక్యూరిటీ కల్పించేందుకు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరుస్తులు షెల్టర్‌ తీసుకుంటున్నారా లేదా అనే విషయం కూడా తెలుస్తుందన్నారు. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కార్డెన్‌సెర్చ్‌ చేశామన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలను చెక్‌ చేసుకోవాలన్నారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే గ్రామ సమీపంలో ఉన్న కొండలో 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఆలూరు, పత్తికొండ టౌన్‌ సిఐలు వెంకటేశులు, రామకృష్ణారెడ్డి, తాలూకా సిఐ మురళీ మోహన్‌, ఆస్పరి ఎస్‌ఐ వరప్రసాద్‌, నలుగురు ఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.