Nov 07,2023 23:52
ఎండిపోయిన కంది పంటను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: 'సిఎస్‌ పురం'ను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి ఉసా వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని పెద్దగోగులపల్లి, వెంగనగుంట, సిఎస్‌ పురం గ్రామాల పరిధిలో సాగు చేసిన కంది, మినుము, మిరప పంటలను మంగళవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఆయా పంటలన్నీ ఎండిపోయి ఉండడాన్ని గుర్తించారు. రైతులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయని, కొన్ని గ్రామాలలో పశువులు తాగేందుకు నీరు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. వెంటనే సిఎస్‌ పురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు సహాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుధవారం తహశీల్దారు కార్యాలయం వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమంలో రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజె రత్నం, రైతులు పాల్గొన్నారు.