Aug 26,2023 22:26

ప్రజాశక్తి-గన్నవరం : కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆదివారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా బందోస్తుకు సంబంధించి కలెక్టర్‌ పి.రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్గమనం వద్ద శనివారం సాయంత్రం భద్రతా ఏర్పాట్లకు సంబందించిన పనుల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం సమీప రహదారి పరిస్థితులను పోలీసు అధికారులు పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్‌లో బిఎస్‌ఎఫ్‌ హెలీకాప్టర్‌ ఎక్కడెక్కడ దిగాలో ఆయా స్థలాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం వరకు ఉన్న దూరం ఎంత ఉంటుందనే విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కష్ణాజిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ.. కేంద్ర హౌమ్‌ మంత్రి అమిత్‌ షా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్‌ లో కొద్ది సమయం గడపనున్న నేపథ్యంలో బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. అలాగే భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాన్వారు రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ కోరారు. పోలీసు శాఖ బ్లూబుక్‌ ప్రకారం తగిన భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్‌, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వైద్య సహాయం నిమిత్తం గన్నవరంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ను పరిశీలించారు. అలాగే రెస్ట్‌ హౌస్‌ గా గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ ను కలెక్టర్‌ పి రాజాబాబు పరిశీలించారు. గన్నవరం ఎయిర్పోర్ట్‌ వద్ద అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని గుణదల డిఈని కలెక్టర్‌ ఆదేశించారు. వర్షాకాలం సీజన్‌ అయినందువల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పి ( ఏ.ఆర్‌ ) ఎస్‌ వి డి ప్రసాద్‌, సి ఆర్‌ పి ఎఫ్‌ డిసి ధనుంజరు యాదవ్‌, గన్నవరం డిఎస్పి జయసూర్య, ఎయిర్పోర్ట్‌ డిఎస్పి వెంకటరత్నం, గన్నవరం ఎయిర్పోర్ట్‌ ఇన్చార్జి డైరెక్టర్‌ పివి రామారావు, గన్నవరం తహసిల్దార్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.