Nov 06,2023 21:39

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
        నారాయణ విద్యాసంస్థల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 17 మంది విద్యార్థులు గాయాలపాలైన ఘటన పెదవేగి మండలం చొదిమెళ్ల సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బస్సులోని విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రూరల్‌ మండలం, పెదవేగి మండలాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు ఏలూరు నగరంలోని నారాయణ కళాశాలలో చదువుతున్నారు. సోమవారం వీరంతా యథావిధిగా కళాశాలకు బస్సులో వెళ్లారు. కళాశాల ముగిసిన అనంతరం వీరంతా కళాశాల బస్సులో ఇళ్లకు బయలుదేరారు. చొదిమెళ్ల సమీపంలో కొందరు విద్యార్థులను దింపిన తర్వాత వంగూరు బయలుదేరింది. చొదిమెళ్ల శివారులోని ఓ మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో సుమారు 43 మంది విద్యార్థులున్నారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీంతో విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే బస్సు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్సు సకాలంలో చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు గాయపడిన విద్యార్థులను దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బయ్యచౌదరి, జనసేన దెందులూరు నియోజకవ్గ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌, జిల్లా అధికారులు పరామర్శించి ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అతివేగమే కారణం
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమన ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదకర మలుపువద్ద కూడా డ్రైవర్‌ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపాడని స్థానికులు తెలిపారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు : ఎంఎల్‌ఎ
గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నామని ఎంఎల్‌ఎ అబ్బయ్యచౌదరి తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గాయపడిన ప్రతీవిద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించే విధంగా డిఎంహెచ్‌ఒకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే ఆసుపత్రివర్గాలు అనునిత్యం వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించేందుకు కూడా చర్యలు చేపట్టాలని సూచించామని తెలిపారు. బస్సు ప్రమాదానికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని, ఒకవేళ బస్సు ఫిట్‌నెస్‌ లేకపోతే బస్సు నడిపే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సాంకేతిక లోపం వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ఆయన తెలిపారు. మొత్తం 17 మంది విద్యార్థులు గాయపడ్డారని, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరిని ఏలూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.