Oct 23,2023 13:15
  • ఎమ్మెల్యే చిర్ల.

ప్రజాశక్తి - ఆలమూరు : పేదల పక్షాన నిలిచే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన సోమవారం  మండల కేంద్రమైన ఆలమూరులో స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంపై మండల వైసీపీ శ్రేణులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చిర్ల  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను నవంబర్ 1నుండి కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రస్థాయి కమిటీల సహకారంతో  నిర్వహించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బస్సు యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వం గత 52 నెలలుగా ఏర్పాటుచేసిన  సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ మ్యానిఫెస్టోలో 98 శాతం అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. లబ్ధిదారులు  అభివృద్ధిని చూసి మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనంతరం గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.