Apr 14,2023 21:39

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

          ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌   అనంతపురం జిల్లా నార్పల మండలంలో నిర్వహించే విద్యాదీవెన పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 17న రానున్నారు. 17వ తేదీ పుట్టపర్తి విమానాశ్రయానికి ఉదయం 9.45 గంటలకు వస్తారు. నార్పలలో కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచే విమానంలో గన్నవరానికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు అదికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్లోనే మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ అరుణబాబు, ఎస్పీ మాధవ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, అడిషనల్‌ ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య శాఖ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్‌, సేఫ్‌రూమ్‌, ఫైర్‌ అధికారులు ఫైర్‌ సేఫ్టీ చర్యలు, ఫుడ్‌ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. విమానం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. కాన్వారు అందుబాటులో ఉండే విధంగా వాహనాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలనికలెక్టర్‌ ట్రాన్స్‌పోర్టు అధికారిని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ రోప్‌ పార్టీ, బందోబస్తు అంశాలపై పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయం నందు భద్రతపై సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టు టర్మినల్‌, రన్వే మొదలైన స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.