ప్రజాశక్తి - పాలకొండ : డంపింగ్ యార్డ్ సమస్య పాలకొండను తీవ్రంగా ఉంది. మేజర్ పంచాయతీ నుంచి కూడా ఈ సమస్య గుదిబండగానే ఉంది. డివిజన్ కేంద్రమైన పాలకొండ నగరపంచాయతీలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డునున్న వెంకటరాయ కోనేరు వద్ద చెత్తను డంప్ చేస్తున్నారు. 4వ వార్డుకు అతి సమీపంలో డంప్ చేయడంతో ఆ వార్డు పరిధిలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ చెరువు మీదగా ఆసుపత్రితో పాటు పల్లు ప్రాంతాలకి వెళ్లే ప్రధాన రహదారి. దీంతో ఆ చెరువుపై నడవాలంటేనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని నెలల క్రితం పట్టంలో కొత్త వీధి దగ్గర రెండు ఎకరాలు డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించారు. డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చుట్టూ పక్క ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిరికొండలో డంపింగ్ యార్డుకు ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. స్థానికులు అడ్డుకొని కోర్టును ఆశ్రయించడంతో ఆ పనులు నిలిచిపోయాయి. దీంతో వెంకటరాయ కోనేరు దగ్గరే చెత్తను పోగులుగా వేస్తున్నారు.










