ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించి పదోన్నతులు చేపట్టాలని, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నందవరం మండలం ముగతి మోడల్ స్కూల్ను సందర్శించి, ప్రిన్సిపల్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యాశాఖ పర్యవేక్షణలో మోడల్ స్కూల్ ఉన్నప్పటికీ హెల్త్ కార్డులు లేవని తెలిపారు. కుటుంబ సభ్యులు జబ్బు పడితే వేల రుపాయలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కారుణ్య నియమాకాలు లేనందు వల్ల ఉద్యోగి చనిపోతే వీరి కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 21మంది చనిపోయారని, వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కారుణ్య నియమాకాలు చేపట్టాలని కోరారు. సిపిఎస్ అమౌంటు డిడక్షన్ చేస్తున్నారని, ఆ అమౌంటు తమ అకౌంటుకు జమ అవుతుందో లేదో తెలియడం లేదని అన్నారు. అలాగే ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు వేస్తున్నారో లేదో కూడా తెలియడం లేదన్నారు. యుటిఎఫ్ నాయకులు విరుపాక్షి, భాగ్యరాజు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప










