ప్రజాశక్తి - కదిరి టౌన్ : మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కదిరిలో ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు శాంతిబాయి, అమరావతి, లక్ష్మీబాయి, రమాదేవి, మణీ, హేమావతి సిఐటియు నాయకులు జగన్మోహన్, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్లో రెండు గిరిజన జాతుల మధ్య చెలరేగిన ఘర్షణను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మణిపూర్ ఘర్షణలకు కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మణిపూర్లో శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరారు.
హిందూపురం : మణిపూర్ మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, పట్టణంలోని చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు సర్కిల్లో నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు సిఐటియు పట్ఠణ కార్యదర్శి నరసింహప్ప మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మణిపూర్లో శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాము, ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్, వీరేష్, రంగనాథ్, బాబా ఫక్రుద్దీన్, హేమంత్, నాగరాజుతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు.










